వేమన పద్యాలు

         ఇప్పుడు దేశమంతా  కరోనా వల్ల అల్లాడుతోంది.అందులో ముఖ్యంగా విద్యార్థులు. గత కొన్ని నెలల నుండి స్కూలు లేక ఇంట్లోనే ఉండిపోయారు. వాళ్లకి స్కూలు లేక బయటికి వెళ్ళ లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  ఇంట్లోనే ఉండి 24 గంటలు  సెల్ ఫోను, ట్యాబ్, టీవీ, కంప్యూటర్ చూస్తూ కాలం గడుపుతున్నారు.  అలాగే స్కూల్ వాళ్లు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. ఈ ఆన్లైన్లో  క్లాసులు సరిగా అర్థం కాక చాలా మంది అవస్థలు పడుతున్నారు.  దానికి తోడు ఈ  ఆన్లైన్ క్లాసులు చూడటం వల్ల ఎక్కువగా పిల్లల కళ్ళు దెబ్బతింటున్నాయి.  ఇది జగమెరిగిన సత్యం. 


  అదీగాక ఇప్పటి పిల్లలకు మన పాత పద్ధతులు, సంస్కృతి, తెలుగు పద్యాలు ఏమీ తెలియవు.మాతృభాషను మనం ఎప్పుడూ మరవకూడదు. మన. ఇప్పటి పిల్లలకి వేమన, దాశరధి, పోతన, సుమతి శతకం వీటి పేరు చెబితే " ఎవరు వీళ్లు " అని ప్రశ్నిస్తారు. ఈ పద్యాలు పిల్లలకు పరిచయం చేయాలనే సంకల్పంతోనే ఈ బ్లాగు రాస్తున్నాను.  ఇది రాయటానికి కారణం మాకు తెలిసిన అబ్బాయి మూడో తరగతి. తక్కువ సమయంలో ఎక్కువగా వేమన పద్యాలు చెప్పి అందరి ప్రశంసలు అందుకున్నాడు.  అందరి పిల్లలు ఇలాగే నేర్చుకోవాలి అనుకుని వ్రాస్తున్నాను.


 మొదటిగా వేమన పద్యాలు కొన్ని రాస్తున్నాను మీకందరికీ ఈ బ్లాగు నచ్చితే మీ పిల్లలకి నేర్పండి వేమన గురించి నాలుగు వాక్యాలు వివరిస్తాను.



వేమన కథ:-

   వేమన చెడు వ్యసనాలకు బానిసై వేశ్యా లోలుడై తిరిగేవాడు. ఆయన వదిన " రత్నమాంబ" మహాపతివ్రత. వేమనని చాలా గారాబంగా తల్లిగా చూసుకునేది.  వేమన వెళ్లే  వేశ్య పేరు " విశ్వధ ".  ఒకరోజు ఆమెకి కలలో ఒక యోగి కనిపించి వేమన పెద్ద యోగి  అవుతాడని అతని ఆమె మోహం నుండి బయటకు పంపేలా చేయాలని చెబుతాడు.  ఆ  కల ప్రకారం  విశ్వద వేమున దగ్గరికి వచ్చి మీ వదిన గారి ముక్కుపుడక కావాలని కోరుతుంది. వాళ్ల వదిన వేమన కోరిక ప్రకారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఇస్తానని అంటుంది. వేమన ఆ రోజు వెళ్లి ముక్కెర అడుగుతాడు అప్పుడు వాళ్ళ వదిన ఒంటిమీద నూలుపోగు లేకుండా నిలబడి ముక్కెరను వచ్చి తీసుకోమని చెబుతుంది. ఆ సంఘటనతో వేమనకి జ్ఞానోదయం అవుతుంది. తల్లి నీవే నాకు గురువు మార్గం చూపమని  వేడుకుంటాడు. అప్పుడు వేమన వదిన, నాయనా నీకు గురువును నేను కాదు, అభిరామ యోగి పుంగవులు. ఆయన నీకు మార్గం చూపుతారు అని ఆ యోగి వద్దకు పంపుతుంది. ఆ యోగి ద్వారా ఉపదేశం పొందిన వేమన " యోగి వేమనగా " మారుతాడు. వేమన యోగి గా మారిన తర్వాత ఆయన నోటి నుండి వెలువడిన పద్యాలు ఆణిముత్యాలుగా ఇప్పటికి కూడా ప్రజాదరణ పొందుతున్నాయి వాటిలో మచ్చుకు కొన్ని:


1) చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత ?
విశ్వదాభిరామ వినుర వేమ!

 విత్తనం చిన్నదైనా మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది. అలాగే మంచి మనసుతో చేసిన పుణ్యం తక్కువైన అది లోపం కాదు.


2) ఆన్ని దానములను నన్నదానమే గొప్ప
 కన్నతల్లి కంటె ఘనము లేదు
 ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
 విశ్వదాభిరామ వినుర వేమ! 

 అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది.  కన్నతల్లి కంటే గొప్ప స్త్రీ లేదు, గురువు కన్నా గొప్ప వాడు ఉండడు.


3) అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగ దినఁగ వేము దీయనుండు
సాధనమున బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!

 పాడగా పాడగా రాగం కుదురుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగానే ఉంటుంది .అభ్యాసం చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమవుతుంది


4) వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!

 వేరుపురుగు చేరి వృక్షాన్ని నాశనం చేస్తుంది. చీడపురుగు చేరి చెట్టుని నాశనం చేస్తుంది. అలాగే మోసగాడు వచ్చి మంచి వాడిని నాశనం చేస్తాడు.

5) అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!

 కంచు మోగిస్తే పెద్ద శబ్దం వస్తుంది. బంగారాన్ని మోగిస్తే తక్కువ శబ్దం వస్తుంది. అట్లాగే చెడ్డవాడు ఆడంబరంగా మాట్లాడుతాడు మంచివాడు మర్యాదగా మాట్లాడతాడు. 

               పిల్లలందరూ ఇది నేర్చుకుంటారని ఆశిస్తూ ....    శుభం !

ఈ వారం చిట్కాలు:-

1)  పెద్దలకి పిల్లలకి జీర్ణశక్తికి:-    మూడు చెంచాల ధనియాలు, రెండు చెంచాల జీలకర్ర ,రెండు చెంచాల మెంతులు, రెండు చెంచాల వాము, గుప్పెడు తులసి ఆకులు ఇవన్నీ విడివిడిగా నూనె వేయకుండా వేయించి చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడి చేసి  గాజు సీసాలో  భద్రపరుచుకోవాలి. 
 ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మూడు కప్పుల నీళ్లు తీసుకుని అందులో 1 టీ స్పూన్ పౌడర్ వేసి మరిగించాలి. అది అరకప్పు అయ్యేలా మరిగించి గోరు వెచ్చగా తాగాలి. ఇలా కొంతకాలం చేస్తే జలుబు, దగ్గు, అజీర్ణ సమస్యలు  మన దగ్గరికి రావు. పిల్లలకైతే వాళ్ళ వయసును అనుసరించి కషాయాన్ని ఇద్దరు, ముగ్గురికి కూడా ఇవ్వచ్చు. ఇందులో తేనె, పంచదార ఏమి కలపకూడదు.

2)  మలబద్ధకం మనకు ఈజీ చిట్కా:-    ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలు పూటకు రెండు చెంచాల చొప్పున మెంతులు నోటిలో వేసుకొని మంచినీరు  త్రాగాలి.  ఇలా పదిహేను రోజులు చేస్తే మీ మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఫ్రీ మోషన్ ఐ ప్రాణం హాయిగా ఉంటుంది.

Previous
Next Post »